"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Sunday, January 15, 2006

జ్ఞానోదయానికి శుభారంభం


పుష్యమాసం తొలి పౌర్ణమి సంకేతాలు.. మంచుదుప్పటి కప్పుకొన్న అమరావతి నగరం.. కృష్ణానదీ తీరంలో కాలచక్ర వేదిక.. జీవితానికి అర్థం తెలుసుకొనేందుకు వచ్చిన ప్రజలు.. భవబంధాలనుంచి విముక్తి కోరుకొనేందుకు సిద్ధమైన వారు.. వారందరికీ దలైలామా అనుగ్రహ భాషణం చేశారు. దలైలామా ఆశీస్సులు పొందేందుకు సుదూర ప్రాంతాల నుంచి శుక్రవారం పలువురు ప్రముఖులు విచ్చేశారు. కాలచక్ర దీక్ష.. ప్రాథమిక సాధికారత కోసం వరుసగా రెండో రోజు జరిగిన కార్యక్రమానికి వేల సంఖ్యలో బౌద్ధభిక్షువులు.. సందర్శకులు.. విదేశీయులు హాజరయ్యారు. హాజరైన వారికి జ్ఞానోదయాన్ని పొందే మార్గాన్ని దలైలామా ఉపదేశించారు. ఉదయం ఎనిమిదిన్నర గంటలకు వేదికపైకి వచ్చిన ఆయన భిక్షువుల్ని, ప్రజల్ని ఆశీర్వదించారు. 'దుఃఖాలు.. బాధలకు కారణం అజ్ఞానమే. దీన్ని అధిగమించడం ద్వారా సుఖసంతోషాలు పొందవచ్చు'అని ఆయన చెప్పారు. మనసులో ఉన్న వ్యతిరేక ఆలోచనలను ఇప్పటికిప్పుడు విడిచిపెట్టండని సూచించారు. ఈర్ష్య, ద్వేషం మనిషిని అధఃపాతాళానికి తోస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చిన్నతనంలో జరిగిన సంఘటనలను ప్రస్తావించారు. సంయమనం.. సత్ప్రవర్తన ద్వారా వ్యతిరేక భావాలను తొలగించుకోవచ్చని వివరించారు.

*****

బుద్ధ బోధశక్తిని చాటిన ఆమ్రపాలి


గుంటూరు కల్చరల్‌, జనవరి 13 (న్యూస్‌టుడే): అమరావతి కాలచక్ర కళావేదికమీద శుక్రవారం రాత్రి ప్రదర్శితమైన సాంస్కృతిక అంశాలలో హైదరాబాద్‌కు చెందిన సుప్రసిద్ధ నాట్య కళాకారిణి స్వాతి సోమనాధ్‌ బృందం ప్రదర్శించిన ఆమ్రపాలి సంగీత నృత్యరూపకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సౌందర్య రాశి అయిన ఆమ్రపాలి ఇహలోక సంబంధ సౌఖ్యాలకన్నా పరలౌకిక ఆనందాన్నిచ్చే బుద్ధతత్వమే మిన్న అనే సత్యాన్ని చాటిన తీరు ప్రశంసనీయంగా ఉంది. బింబిసారుడు, ఆమ్రపాలి మధ్యన జరిగిన సంభాషణాత్మక నృత్యాభినయం కూడా అందరిని ఆకట్టుకుంది. ఇదే వేదికమీద సుప్రసిద్ధ గాత్ర విధుషీమణులు విశాఖ సిస్టర్స్‌ చేసిన గాత్ర కచేరి ప్రేక్షక జనరంజకంగా సాగింది. డి.రాధిక, ఎస్‌.శాంతిలు చేసిన ఈ కచేరిలో అన్నమయ్య కీర్తన 'మొద్దుగారే యశోధ ' దేశవిదేశీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ కీర్తనతోపాటు కళ్యాణి రాగంలో వర్ణం, హంసధ్వని రాగంలో వాతాపిగణపతిం తదితర కీర్తనలను శ్రావ్యంగా గానం చేశారు. కచేరికి వయోలిన్‌తో టి.నందకుమార్‌, మృదంగంతో కె.వి.రామకృష్ణ చక్కగా సహకరించారు. అనంతరం ప్రముఖ ఇంద్రజాలికుడు ఫైర్‌ రఘు నిప్పుతో పలు విన్యాసాలను చేసి ఆశ్చర్య చకితులను చేశారు. అలాగే గుంటూరుకు చెందిన ప్రముఖ మిమిక్రీ కళాకారుడు బి.శివ మిమిక్రీ ప్రదర్శనతో నవ్వుల జల్లులు కురిపించాడు. ఆతర్వాత ఆపాత మధురాలు పేరున సినీ పాట కచేరి జరిగింది. స్టాలిన్‌బాబు, హిందూ కళాశాల ఇంగ్లీషు లెక్చరర్‌ బాలశౌరి, నీలు, హిమబిందు, సుభాని, ఉమాకుమార్‌ తదితరులు తెలుగు, హిందీ చిత్రాలలనో పలు పాటలన గానం చేశారు. కచేరికి కీబోర్డు, గిటారుతో ఎస్‌.రాజబాబు, ప్యాడ్స్‌తో టి.పెద్దిరాజు, తబాలతో నాగు, విజయరాజు, జాజ్‌, డ్రమ్స్‌తో బుజ్జి సహకరించారు.

*****

విదేశీ రుచుల పట్ల మొగ్గు

అమరావతి, జనవరి 13 (న్యూస్‌టుడే): అమరావతిలో జరుగుతోన్న 30వ కాలచక్ర మహాసభల ఉత్సవాలకు వచ్చే బౌద్ధులు, విదేశీయాత్రికులకు ఇక్కడి రుచులు, ఆహారపు అలవాట్లు నచ్చడం సహజమే. కాని టిబెటన్ల ఆహారపదార్థాల వైపు స్థానికులు ఆసక్తి చూపటం విశేషం. ముఖ్యంగా టిబెటన్ల ఆహారమైన లెఫింగ్‌ను స్థానికులు ఎక్కువగా తీసుకొంటున్నారు. బౌద్ధమత ప్రవచనాలు వినటానికి వచ్చినవారు తీరిక సమయాల్లో ఈ అల్పాహారాన్ని తయారుచేసి విక్రయిస్తున్నారు. న్యూడిల్స్‌ మాదిరిగా ఉండే ఈ ఆహారాన్ని పది రూపాయలకు అమ్ముతున్నారు. ప్రతిరోజూ ఈ విధమైన అమ్మకాలు జరుగుతున్నట్టు టిబెట్టుకు చెందిన లాబ్‌సంగ్‌దుందూప్‌ వివరించారు.
విదేశీయుల తాకిడి
అమరావతి, జనవరి 13 (న్యూస్‌టుడే): కాలచక్ర మహాసభలను వీక్షించేందుకు శుక్రవారం నాటికి 980 మంది విదేశీ నమోదు కేంద్రంలో పేర్లు నమోదు చేయించుకున్నారు. అనధికారంగా ఈ సంఖ్య మరో వెయ్యి వరకు ఉండొచ్చని అధికారులు వివరిస్తున్నారు. టిబెట్‌, నేపాల్‌, హిమాచల్‌ప్రదేశ్‌, మిజోరాం లాంటి ప్రదేశాల నుంచి వచ్చే వారు విదేశీల నమోదు కేంద్రంలో తమ సమాచారం నమోదు చేయించుకోనక్కర్లేదని, ఇతర దేశాల వారు మాత్రం కచ్చితంగా నమోదు చేయించుకోవాలని తెలిపారు. కాలచక్ర సభలు ముగింపులోగా ఇంకో రెండొందల మంది విదేశాల నుంచి రావచ్చని పేర్కొంటున్నారు.

ధ్యానబుద్ధుడిని దర్శించుకొంటున్న ప్రముఖులు

అమరావతి, జనవరి 13 (న్యూస్‌టుడే): ధ్యానబుద్ధవిహార్‌ను నిత్యం అతిథులు దర్శించుకుంటూనే ఉన్నారు. 125 అడుగుల ఎత్తులో నిర్మితమవుతోన్న ధ్యానబుద్ధ విగ్రహాన్ని తిలకించి అచ్చెరువొందుతున్నారు. శుక్రవారం అమరావతి విచ్చేసి దలైలామాను దర్శించుకున్న వారిలో అడిషనల్‌ ఏడీజీ కె.జయచంద్ర, డీజీపీ రజ్వంత్‌సింగ్‌, ఓఎస్‌డీ మనీష్‌కుమార్‌సిన్హా, రాష్ట్ర పర్యాటక శాఖ జాయింట్‌ సెక్రటరీ జి.నాగేశ్వరరావు, మాజీ పార్లమెంటు సభ్యుడు వై.వి.రావు, దేశం నాయకురాలు నన్నపనేని రాజకుమారి, జిల్లా పరిషత్‌ అధ్యక్షుడు పాతూరి నాగభూషణం, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర ఉన్నత విద్యశాఖ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు, తానా అధ్యక్షుడు బండ్ల హనుమయ్య, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ తదితరులున్నారు.
కాలచక్ర మహోత్సవాలను తిలకించేందుకు అమరావతి విచ్చేస్తున్న సందర్శకులు, బౌద్ధభిక్షువులకు పురావస్తుశాఖ సంక్రాంతి బొనంజాను ప్రకటించింది. ఈ నెల 15 వరకు మ్యూజియం, మహాచైత్యం దర్శించేందుకు ఎలాంటి రుసుం వసూలు చేయడం లేదని అధికారులు తెలిపారు.

Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra Pradesh , India , Buddha Buddhist , Amaravati Guntur , Kalachakra 2006 , Dalai Lama , Tibet Tibetan , stupa , mahachaitya , Mahayana , Theravada , Eenadu January 2006 , Nagarjunasagar, Nagarjunakonda


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


0 Comments:

Post a Comment

<< Home